ఈ విషయాలను పాతబస్తీ వాసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • జేబీఎస్ - ఎంజీబీఎస్ వరకూ ‘మెట్రో’లో ప్రయాణించిన కిషన్ రెడ్డి
  • పాతబస్తీకి ‘మెట్రో’ రాకుండా ఎంఐఎం అడ్డుపడుతోంది  
  • అందుకు టీఆర్ఎస్ వంతపాడుతోంది
హైదరాబాద్ లోని జేబీఎస్ మెట్రో రైల్ స్టేషన్ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు సందర్శించారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకూ ‘మెట్రో’లో ఆయన ప్రయాణించారు. ఆయనతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నేతలు కలిసి ప్రయాణించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాతబస్తీకి మెట్రో రైల్ వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇందుకు ఎంఐఎం అడ్డుపడుతోందని ఆరోపించారు. పాతబస్తీ చాలా వెనుకబడి ఉందని, ఈ ప్రాంతానికి గత ప్రభుత్వాలు కానీ, ప్రస్తుత సర్కార్ గానీ చేసిందేమీ లేదని విమర్శించారు. పాతబస్తీ వాసుల హక్కు ‘మెట్రో’ అని, ఈ హక్కును దూరం చేయడంలో ఎంఐఎం కుట్ర ఉందని, అందులో, టీఆర్ఎస్ భాగస్వామి అని దుయ్యబట్టారు. ఈ విషయాలను పాతబస్తీ వాసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిన రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీ వాసులకు ‘మెట్రో’ను దూరం చేసిందని మండిపడ్డారు. ఫలక్ నుమా వరకు మెట్రో నిర్మాణం చేయాలన్న ఒప్పందం ఉందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఎంఎంటీఎస్ గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఫేజ్-2 లో భాగంగా యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్థల సేకరణ చేయడం లేదని విమర్శించారు. హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ కనెక్టివిటీలో కొంత లోపం ఉందని, ఆ లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత ఎల్ అండ్ టీ, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఈ విషయమై అవి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Kishan Reddy
BJP
Hyderabad
Old city
TRS
MIM

More Telugu News